కొలంబియా : నరేంద్ర మోడీ పాలనలోని భారత్లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన ఈఐఏ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిఒక్కరికీ చోటుకల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేటదాడిని ఎదుర్కొంటోందన్నారు. భారత్ని చైనాతో పోలుస్తూ.. భారత్ 1.4 బిలియన్ల జనాభాను కలిగి ఉంది, అపార అవకాశాలు ఉన్నాయని, కానీ భారత్ చైనాతో పూర్తిగా భిన్నంగా ఉందని, చైనా వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని, భారత్ తో మాత్రం వికేంద్రీకరణ ఉందని, వివిధ సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని, ఇది సంక్లిష్టమైన వ్యవస్థ అని అన్నారు. భారత్లో భిన్నమైన ఆచారాలు, మతాలు, ఆలోచనలు ఉన్నాయని, ఇవి వ్యక్తమయ్యే స్థలం కావాలని అని అన్నారు. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూల్చివేయాలనే ప్రయత్నం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. భిన్న మతాలు, సంప్రదాయాలను ప్రోత్సహించడం భారత్కి చాలా అవసరమని, చైనా లాంటి నియంతృత్వం భారత్లో కుదరదని ఆయన అన్నారు. ప్రపంచ నాయకత్వాన్ని అందుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని, గ్లోబల్ లీడర్ షిప్ రేసులో చైనా ముందు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చైనా కన్నా భారత జనాభానే ఎక్కువ అని ఆయన అన్నారు.
ఎనర్జీ ట్రాన్సిషన్ సమయంలో సామ్రాజ్యాలు ఏర్పడుతాయని, బ్రిటిష్ స్టీమ్ ఇంజన్, బొగ్గును నియంత్రించి ప్రపంచశక్తిగా మారిందని, అమెరికన్లు తరువాత పెట్రోల్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్తో ఆధిపత్యం సాధించారని, ఇప్పుడు ఫ్యూయెల్ ట్యాంక్ నుంచి బ్యాటరీకి మారుతున్న సమయంలో చైనా, అమెరికా పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో చైనా ముందుదని చెప్పారు.